1యోతాము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా.
2యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతని కాలంలో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు.
3అతడు యెహోవా మందిర పై ద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలావరకు కట్టించాడు.
4అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.
5అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3, 400 కిలోల వెండినీ, అరవై రెండు వేల తూముల గోదుమలనూ, అరవై రెండు వేల తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు.
6యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యధార్థం ప్రవర్తించాడు కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు
7యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్దాలన్నిటినీ గురించి, అతని పద్ధతులను గురించి, ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసివున్నాయి.
8అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు.
9యోతాము కన్ను మూసి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు.
<< 2 Chronicles 27 >>